(ప్రజాశక్తి తెలుగు దినపత్రికలోని సాయినాథ్ గారి వ్యాసం )
ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన ఒక అంశంతో మీరు ఏకీభవించాలి. ఆయనది కుంటి సర్కార్ కాదు. నిజానికి ఆయనను 'వంట ఇంటి కుందేలు ప్రభుత్వం ' అంటే సరిగ్గా అతుకుతుంది. ఏదియేమైనప్పటికీ గత పది రోజులుగా లక్ష కోట్ల రూపాయల సరికొత్త కుంభకోణమేదీ బయటపడలేదంటే, పరిస్థితి కొంత మెరుగుపడినట్లు అనుకోవచ్చునన్న మాట. ఎంపిక చేసిన కొద్దిమంది తన ప్రియ శిష్యులతో ప్రొఫెసరుగారు జరిపిన చర్చాగోష్టి పై రెండు దశాబ్దాలుగా డాక్టర్ సింగ్కు భజన చేస్తున్న ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమ అధినేతల, సంపాదకులు సైతం పెదవి విరిచారు. చర్చాగోష్టిలో వారు ఆయననేమీ బాధించలేదు. ఇరుకున పెట్టే ప్రయత్నం అంతకన్నా చేయలేదు. తనకు తోచిన విధంగా మాట్లాడుకునేందుకు ఆయనకు అవకాశమిచ్చారు. సంపాదకుల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గాలేదు. సరియైన ప్రశ్నలను సంధించడమే పాత్రికేయ వృత్తికి ఆయువుపట్టు. ఆ విధంగా చూసినప్పుడు కొందరు దారి తప్పారనే చెప్పాలి. అవినీతి గురించి కొంత భావోద్వేగంతో ప్రశ్నించారు. అయితే, సంవత్సరాల తరబడి తాము ఆరాధిస్తున్న విధానాల నుండే ఈ అవినీతి పుట్టుకొచ్చినప్పటికీ వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు.
కొన్ని ప్రశ్నలైతే ఆందోళనలో చిక్కుకున్న సంపాదకుల అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటి విధానాలే కొనసాగుతున్నాయన్న హామీని వారు తిరిగి పొందారు. ఉదాహరణకు, 'యుపిఏ-2 నుంచి బ్రహ్మాండమైన వెల్లువ రావటం లేదన్న' భయం ఉన్నది. కఠినమైన సంస్కరణల నిర్ణయాలను తీసుకునే శక్తిని కోల్పోయామా? 'అలాంటిదేమీ లేదన్నదే' ప్రధాని సమాధానం. 'మనం శక్తిని కోల్పోలేదు, మనం గట్టిగా నిలబడగలమని ప్రధాని నొక్కి చెప్పారు. సంస్కరణలు సరైన గాడిలోనే ఉన్నాయన్నది ఆయన ఉవాచ. డాక్టర్ సింగ్ నిజం పలికారు. సంపాదకులు కాస్త ఆలోచనకు పదును పెట్టినట్లయితే తమను కలవరపరుస్తున్న అస్తవ్యస్థత, అవినీతి ఆ 'సంస్కరణల' పుణ్యమేనని అర్థమైవుండేది.
అవినీతికి సంబంధించిన ప్రశ్నలు సైతం కొంతమంది మంత్రుల చర్యల చుట్టూ తిరిగాయి. ప్రొఫెసర్గారు చూపుతున్న దారి విధ్వంసకరమైనదీ, ప్రమాదకరమైనదీ అన్న విషయాన్ని ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కటీ వ్యక్తం చేయలేకపోయాయి. 1991 నుంచి ఉనికిలోకి వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అద్భుతమూ, ఆశ్చర్యమూ అంటూ ఒక్కసారి పొగిడినట్లయితే సహజంగానే వారి ప్రశ్నలకు పరిమితి ఉంటుంది. కార్పొరేట్ నేర స్వభావం రీత్యా మరో మార్గం లేనప్పుడు లేదా ఏ పరిణామాన్నయినా ఎదుర్కోవటానికి సిద్ధపడినపుడు మాత్రమే సంపాదకులు అలాంటి ప్రశ్నలు వేయగలరు.
కాస్త చెప్పుకోదగిన మొట్టమొదటి ప్రశ్న ఏమంటే 2జి కుంభకోణం గురించి, అలానే స్పెక్ట్రమ్ను వేలం వేయకపోవటం గురించి అడిగినది. ఇక్కడొక విషయం ప్రస్తావనకు రాలేదు. నిజానికి, స్పెక్ట్రమ్ వేలం జయప్రదంగా జరిగింది. అయితే, దీనిని ప్రభుత్వం కాక, కార్పొరేట్ రంగ ఆశ్రితులు (కార్పొరేట్ సెక్టార్ క్రోనీస్) నిర్వహించారు. నామమాత్రమైన ధరలకు లభించిన అపురూపమైన ఈ దేశ వనరును ప్రైవేటుగా వేలం వేసి అనూహ్యమైన ధరకు అమ్ముకున్నారు. ప్రైవేటు కంపెనీలకు చౌకగా లభించినందునే వినియోగదారులకు చౌకగా అందుబాటులోకి వచ్చిందంటూ చేసే వాదన మోసపూరితమైనదే. ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందిన కంపెనీలు వాటిని తిరిగి రెట్టింపు ధరలకు అమ్మినప్పటికీ ఖాతాదారులకు చౌక ధరలకే లభిస్తున్నాయి. ఈ కంపెనీలు స్వయంగా నిర్వహించిన వేలం పాటల ద్వారా అపారమైన లాభాలు పోగేసుకున్నాయి. ఈ పరిస్థితే లేకుంటే వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరి ఉండేది.
చచ్చు ప్రశ్న
ఇకపోతే 'నల్లధనం' గురించి వేసిన చచ్చు ప్రశ్న, వాటికి వచ్చిన సమాధానం వేదాంతులకు అర్థమవుతుందేమో కానీ, సామాన్యులకు అర్థమయ్యే ఆస్కారమే లేదు. భారతదేశంలోని అక్రమ సంపాదన సముద్రాలు దాటి స్విస్ లేదా ఇతర బ్యాంకులకు తరలుతుండడం గురించి ఎవరూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. విదేశాల్లో రహస్య ఖాతాలున్న వారి పేర్లను ప్రభుత్వం బయట పెట్టకపోటానికి కారణం ఏమిటని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. అక్రమ మార్గాలలో సంపాదించిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నదని, ఈ తరలింపు సగటున రోజుకు సుమారు రూ.240 కోట్లు ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటి అనే సంస్థ పేర్కొన్నది. 2004 నుంచి 2008 మధ్య రూ.4.3 లక్షల కోట్లను (2జి కుంభకోణంలో నష్టపోయిన దానికన్నా రెట్టింపు) దేశం నష్టపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో దోషులెవరు? భారతదేశంలోని ప్రైవేటు రంగం నుంచి అక్రమంగా ధనం తరలి పోవటానికి ఉన్నతస్థాయి వ్యక్తులు, ప్రైవేటు కంపెనీలే ప్రధాన కారణం. ఈ విషయాల గురించి ప్రధాన మంత్రిని ప్రశ్నలు వేసివుంటే బాగుండేది. కాని ఎవరూ అడగలేదు. ఇలాంటి నేరస్తులకు ఆయనగారి ప్రభుత్వం ప్రకటించదలచుకున్న క్షమాభిక్ష లేదా మినహాయింపు పథకాల గురించిన ప్రశ్నలు కూడా రాలేదు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా విలాసరావు దేశముఖ్ను ప్రధాని నియమించటంలోని ఔచిత్యం గురించీ, నైతికత గురించీ సంపాదకులు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మహారాష్ట్రలో వడ్డీ వ్యాపారులకు రక్షణగా నిలబడినందుకుగాను సర్వోన్నత న్యాయస్థ్ధానం అభిశంసనలను ఎదుర్కొన్న వ్యక్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధికి బాధ్యుడుగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థ్ధానం విధించిన రూ.10 లక్షల జరిమానాను చెల్లించింది. అంటే, ముఖ్యమంత్రిగా విలాసరావు ఉండగా తప్పు జరిగిందని అంగీకరించడం అన్నమాట. ఈ ఉదంతంలో 'సంకీర్ణ ధర్మ' అన్న వాదనను ప్రధాని చేయలేరు. ఎందుకంటే, ఈ దేశముఖ్గారు ఆయన స్వంత పార్టీకి చెందిన వారే. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిన తరువాత కూడా ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారంటే అందుకు కారణం మన్మోహన్ సింగ్గారు ఆయనను కావాలనుకోవటమే. కామన్వెల్త్ కుంభకోణంలో సైతం 'సంకీర్ణ ధర్మం' అన్న వాదన చెల్లదు. అయినప్పటికీ దీని గురించి కూడా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు.
1995 నుంచి ఈ దేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన రెండున్నర లక్షల మంది రైతుల గురించి ఈ సంపాదకులు ప్రధానిని ప్రశ్నిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. పొట్టచేతపట్టుకుని గ్రామాలను వదలి వెళ్తున్న వారి గురించి కూడా వీరికి ఏమీ పట్టలేదు. అలానే పెరుగుతున్న నిరుద్యోగం గురించీ, ఆకలి బాధల గురించీ ఒక్క ప్రశ్న కూడా రాలేదు. వృద్ధ్ది రేటు 8.5 శాతం ఉన్న దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరగటం గురించి ఒకేఒక్క ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న వేసింది విదేశీయుడు కావటం విశేషం. తమ ఛానెల్స్ను చూసే మధ్య తరగతి వీక్షకులు సైతం ఈ ధరల పెరుగుదల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి సంపాదకులకు తెలుసు. కాని, సిఎన్ఎన్కు చెందిన శారా సిడ్నర్ మాత్రమే తత్సంబంధిత ప్రశ్న వేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించిన మరో ప్రశ్న ఏమంటే, వ్యవసాయ రంగంలో రెండవ విడత వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించినది. ధరల పెరుగుదల గురించి (పేదల ఆకలికి సంబంధించినది కాదు) వచ్చిన మరో ప్రశ్నకు సమాధానం రాలేదు. 2జి కుంభకోణంలో వచ్చిన నష్టాన్ని పేదలకిచ్చే సబ్సిడీతో ప్రధాని పోల్చినపుడు దానికెవరూ అభ్యంతరం చెప్పలేదు. ''వేలం పాటలు జరగనపుడు నష్టాన్ని అంచనా వేయడానికి మీకున్న ప్రాతిపదిక ఏమిటి?.....అది మీ అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. మన బడ్జెట్లో ఆహారానికి ఏడాదికి రూ.80,000 కోట్ల సబ్సిడీని ఇస్తున్నాము. ఈ ఆహార ధాన్యాలను మార్కెట్ ధరలకు అమ్మవచ్చుగదా అని ఎవరైనా అడగవచ్చు. మార్కెట్ ధరకు అమ్మకపోవటం వలనా, సబ్సిడీ ఇస్తున్నందున రూ.80,000 కోట్ల నష్టం వస్తుందని ఎవరైనా అనగలరా?'' ఇదీ ప్రధాని వితండ వాదం.
దోపిడీ-సబ్సిడీ
మొట్టమొదటి విషయమేమంటే, దోపిడీని, ప్రపంచంలోనే అత్యధికంగావున్న అన్నార్తులకిచ్చే కొద్దిపాటి సబ్సిడీలతో పోల్చటం. ప్రపంచ ఆకలి సూచిలోని 87 దేశాలలో మన దేశం 67వ స్థానంలో ఉన్నది. రెండవదేమంటే, కోటీశ్వరులకు ఇచ్చే సబ్సిడీలు ప్రతియేటా పెరుగుతున్నాయి. అదే సమయంలో కోట్లాదిమంది అన్నార్తులకిచ్చే సబ్సిడీలలో ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.450 కోట్ల మేరకు కోత పెట్టింది. కార్పొరేట్ ప్రపంచానికి మాత్రం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అవకాశం వచ్చినప్పుడల్లా వేల కోట్ల రూపాయల మేర పన్నుల రాయితీలు ఇస్తున్నది. దీనిని కార్పొరేట్ పన్ను మాఫీ అనొచ్చు. గత బడ్జెట్లో కేవలం మూడు పద్దులు (కార్పొరేట్ రాబడి పన్ను, కస్టమ్, ఎక్సైజు సుంకాలు) కింద నేరుగా అయిదు లక్షల కోట్ల రాయితీలిచ్చింది. అంటే ఇది 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో నష్టపోయిన సొమ్ము కన్నా రెండున్నర రెట్లు ఎక్కువన్నమాట. ప్రతి బడ్జెట్లోనూ సింహభాగం కార్పొరేట్ రంగానికే దక్కుతున్నది. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థల గురించి ప్రధాన స్రవంతికి చెందిన ప్రసార మాధ్యమం ఎన్నడూ నిరసన తెలిపిన పాపానపోలేదు. ప్రధానితో సాగిన ఈ చర్చాగోష్టిలో కూడా వారు ఆ పని చేయలేదు. 2జి కుంభకోణంలో కొంతమంది బడా బాబులకు చిరు కానుకగా ఇచ్చిన సొమ్ము (లక్షా 76వేల కోట్లు) గురించి అడిగినప్పుడు ప్రధాని చిరాకుపడ్డారు. వెంటనే ఆహార సబ్సిడీ కింద ఇచ్చే రూ.80,000 కోట్లను కూడా మీరు నష్టంగా పరిగణిస్తున్నారా అని సంపాదకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. వాళ్ళలో ఎక్కువ మంది అలానే భావిస్తున్నారు. పేదలకిచ్చే సబ్సిడీలన్నిటినీ రద్దు చేయాలని కొందరు కోరుతున్నారు. వీరిలో కొందరు పేదలకు నేరుగా సబ్సిడీలు ఇవ్వడం సరికాదంటున్నారు. దీనినే రాజకీయంగా నాజూకైన పదాలలో ''వ్యవస్థను చక్కదిద్దాలి'', ''లక్ష్యాలను సరిగా నిర్దేశించుకోవాలి'', ''సామర్థ్యం పెరగాలి '' వ్యక్తం చేస్తుంటారు. అయితే, శత కోటీశ్వరులకు ( (వీరిలోమీడియా యజమానులు కూడా వున్నారు) సునామీ వలె పెద్ద యెత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటే దానిపై ఎన్నడైనా ఇటువంటి డిమాండ్ చేశారా?
ఒక సానుకూలాంశమేమిటంటే ఎడిటర్లతో నిర్వహించే చర్చాగోష్టిలో ఎటువంటి మంత్రుల బృందం వుండదనడం. బహుశా మంత్రుల బృందాల గణనకు వారి అవసరముందనుకున్నారో ఏమో! ప్రధాని హాజరయ్యే ప్రతి సమావేశంలోనూ కనిపించే ప్రణబ్ ముఖర్జీని కూడా పక్కన పెట్టడం గురించి అడిగితే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారోనని దానిని కూడా విడిచిపెట్టారు.